జనసముద్రంన్యూస్, మే29, పల్నాడు జిల్లా , బెల్లంకొండ మండలం.
ఎన్నికల పోలింగ్ రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు కలకలం రేపాయి. అలర్ట్ అయిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకుని.. నాటు బాంబులను దాచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలోకి వెళ్తే ….పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం లోని నాగిరెడ్డిపాలెంలో నాటు బాంబులు కలకలం రేపాయి. ఏకంగా ఓ ప్రభుత్వ వాలంటీర్ ఇంట్లోనే ఈ బాంబులు కనిపించాయి. ఎన్నికల పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని.. పోలీసుల అలర్ట్ అయ్యారు. కౌంటింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు పోలీసులు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అణువణువూ గాలిస్తున్నారు.ఈ క్రమంలోనే బుధవారం నాడు నాగిరెడ్డిపాలెంలో పోలీసులు సోదాలు చేపట్టారు. ఓ వాలంటీర్ ఇంట్లో నాటు బాంబులు కనిపించాయి. వెంటనే వాటిని సీజ్ చేశారు పోలీసులు. వాలంటీర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ వాలంటీర్ తండ్రి వైసీపీకి చెందిన నాయకుడు కావడం మరో విశేషం. దీంతో వాలంటీర్ను, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.కొద్ది రోజులకు ముందు కూడా పలువురు వైసీపీ నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు దొరికాయి. జిల్లాలోని గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో వైసీపీ నేతల ఇళ్లలో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు లభించాయి. ఎన్నికల వేళ జరిగిన గొడవల నేపథ్యంలో పోలీసులు పిన్నెల్లిలో తనిఖీలు చేపట్టగా.. ఈ బాంబులు లభించాయి. ఇప్పుడు నాగిరెడ్డిపాలెంలో నాటు బాంబులు దొరకడం కలకలం రేపుతోంది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అల్లర్లు సృష్టిస్తారోనని ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.





