మెదక్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో అని?
జన సముద్రంన్యూస్, మే 16,
(పాపన్నపేట )
లోక్సభ ఎన్నికలు ముగియటంతో ఫలితాలపై బెట్టింగ్లు షురూ అయ్యాయి. ముఖ్యంగా మెదక్ స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొనడంతో అందరి దృష్టి ఈ స్థానంపైనే కేంద్రీకృతమైంది. ఓటింగ్ సరళిని బట్టి తక్కువ మెజారిటీతోనే గెలుపోటములు ఉంటాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో బెట్టింగ్ రాజాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలైన భాజపా, భారాస పార్టీల అభ్యర్థుల గెలుపు, ఓటములపై రూ.లక్షల్లో బెట్టింగులు పెట్టినట్లు చెప్పుకొంటున్నారు. హైదరాబాద్లో నివాసం ఉండే మెదక్ పార్లమెంటు పరిధికి చెందిన కొందరు వ్యవసాయ క్షేత్రాల వద్ద వేడుకలు నిర్వహించుకుంటూ ఈ బెట్టింగ్ వ్యవహారంలో గుట్టుగా చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని కొందరు, మరో ప్రధాన పార్టీయే గెలుస్తుందని మరికొందరు బెట్టింగ్లోకి దిగిపోయినట్లు తెలిసింది. పలువురు నగదు, చెక్కుల రూపంలో బెట్టింగ్ కాసినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బెట్టింగ్ సాగించి నగదు చేజిక్కించుకున్న కొందరు ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగి బెట్టింగ్ వ్యవహారానికి పాల్పడుతున్నట్లు సమాచారం. భారాస అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నేతలు హోరాహోరీ ప్రచారం నిర్వహించి విజయంపై ధీమాతో ఉన్నారు. భాజపా, కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు తీరిక లేకుండా ప్రచారాన్ని హోరెత్తించారు. వ్యూహ ప్రతి వ్యూహాలో సాగిన ప్రచారం తరువాత ఓటింగ్ ముగిసింది. అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు బూతుల వారీగా పోలైన ఓట్లు, పట్టున్న గ్రామాల తీరును పరిశీలిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఖర్చు ఏరులై పారింది. ఇప్పుడు బెట్టింగ్లోనూ రూ.లక్షల్లో చేతులు మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా మెదక్ పార్లమెంటు స్థానం విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి
(వారేవేణుగోపాల్.)జర్నలిస్ట్





