జనసముద్రం న్యూస్,హైదరాబాద్, జూలై 8:

హైదరాబాద్ మహానగరంలో పేరున్న ఒక ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం నోటి వెంట మాట రాకుండా చేస్తోంది. పది రోజుల శిశువుకు చికిత్స కోసం తీసుకెళితే.. చికిత్సలో భాగంగా నయం చేయాల్సింది పోయి.. వారి నిర్లక్ష్యం కారణంగా ముక్కే లేకుండా పోవటం షాకింగ్ గా మారింది. పుట్టినప్పుడు చక్కగా ఉన్న తమ బిడ్డ.. చికిత్స కోసం వెళ్లినంతనే ముక్కు లేకుండా చేసిన వైనంపై తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ మహానగరంలో అబిడ్స్ ప్రాంతంలో ఉండే ఫెర్నాండెజ్ ఆసుపత్రికి మంచి పేరుంది. తాజాగా పాతబస్తీకి చెందిన ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఇటీవల (జూన్ 8న) మగబిడ్డ పుట్టాడు. పిల్లల కోసం పదమూడేళ్లుగా ఎదురుచూస్తున్న వారి కుటుంబంలో పండంటి మగ పిల్లాడు పుట్టటంతో.. వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఫతే ఖాన్ అన్న పేరును పెట్టుకున్నారు. ఫెర్నాండెజ్ ఆసుపత్రిలోనే జన్మించిన ఈ శిశువుకు పది రోజులకే ఆరోగ్య సమస్య ఎదురైంది.దీంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఫతే ఖాన్ శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పిన వైద్యులు.. అతడికి ఆక్సిజన్ పెట్టేందుకు ఎన్ఐసీయూకు తీసుకెళ్లారు. పది రోజుల వరకు పిల్లాడ్ని చూపించలేదు.
తమ పిల్లాడ్ని తమకు చూపించాలని గట్టిగా కోరినంతనే.. ఫతే ఖాన్ ను చూపించారు. ఆ సమయానికి శిశువు ముక్కు నల్లబడినట్లుగా గుర్తించారు. ఎందుకిలా అని వైద్యుల్ని ప్రశ్నించగా.. ఆక్సిజన్ పెట్టటంతో ముక్కుకు ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పి దాన్ని నయం చేయటానికి రూ.18 వేల విలువైన ఒక ఆయింట్ మెంట్ ను తెప్పించారు.
తాజాగా తమ పిల్లాడ్నిచూసేందుకు వైద్యుల్ని కోరగా.. వారు చూపించారు. దీంతో.. ఫతే ఖాన్ తల్లిదండ్రులు షాక్ తిన్నారు. కారణం.. నల్లగా మారిన ముక్కు ముందు భాగం ఊడిపోయి ఉంది.. దీంతో.. వారు తమ బిడ్డకు ఏమైందని ప్రశ్నించగా.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో వారు నారాయణగూడ పోలీస్ స్టేష్ లో ఫిర్యాదు చేశారు. పిల్లాడి చికిత్స కోసం ఇప్పటివరకు తాము రూ.5 లక్షలు ఖర్చు చేశామని భోరుమంటున్నారు.పుట్టినప్పుడు చక్కగా ఉన్న ముక్కును.. ఇన్ఫెక్షన్ ఉందన్న పేరుతో చేసిన చికిత్సతో ముక్కు లేకుండా పోయిన వైనం షాకింగ్ గా మారింది. ఈ వివాదంపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. ఏడాది తర్వాత ముక్కును సరిచేస్తామని.. పూర్తిస్థాయిలో ప్లాస్టిక్ సర్జరీ చేయాలంటే పదేళ్ల తర్వాత వీలవుతుందన్న మాట మరింత మంట పుట్టేలా మారింది. ఆసుపత్రి నిర్వాకంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.





