జనసముద్రం న్యూస్,తాడిపత్రి,జూన్ 3:

అనంతపురం జిల్లా తాడిపత్రి సీఐగా వ్యవహరిస్తున్న 52 ఏళ్ల ఆనందరావు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన ఆనందరావు పోలీసుగా బాధ్యతలు చేపట్టి.. పలు స్టేషన్లలో విధులు నిర్వహించారు. తొమ్మిది నెలల క్రితం తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. భార్య.. ఇద్దరు పిల్లలు సంతానం. తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీలో ఆయన.. ఆయన కుటుంబం అద్దెకు ఉంటోంది.అయితే.. భార్య భర్తల మధ్య తరచూ తగదాలు చోటు చేసుకుంటూ ఉంటాయని చెబుతారు. మూడు నెలలుగా తీవ్రమైన పని ఒత్తిడితో పాటు.. ఇంట్లో గొడవలతో ఆయన మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నట్లు చెబుతున్నారు. గత ఏడాది సెప్టెంబరులో కడప నుంచి తాడిపత్రికి బదిలీ మీద వచ్చారు. గడిచిన కొన్ని రోజలుగా భార్య అనురాధతో ఆయనకు గొడవలు జరుగుతున్నాయి.
ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. అది కొన్ని గంటల పాటు సాగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఉరి వేసుకొని మరణించిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఆనందరావు ఆత్మహత్య సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు బాధితుడి ఇంటికి వచ్చి.. పరిస్థితిని సమీక్షించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సీఐ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్య ఉదంతాన్ని మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.





