
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మే 09
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీ స్థాయి అధికారులతో కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ నేరేడ్ మెట్ లోని కమీషనర్ ఆఫీస్ లో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాచకొండ పరిథిలో జరిగే నేరాలను అరికట్టాలని, ప్రజలు ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరస్తులను పట్టుకోవటంలో, నేర పరిశోధనలో, సాంకేతిక ఆధారాలను మరియు సీసీటీవీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలను వెంటాడి పట్టుకోవాలని ఆదేశించారు. రాచకొండ పరిధిలోని పాత నేరస్తుల కదలికల మీద నిఘా వేసి ఉంచాలని, వారు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల కమిషనరేట్ పరిధిలో వివిధ రకాల నేరాల శాతం చాలా తగ్గిందని ఈ సందర్భంగా కమిషనర్ గుర్తు చేశారు. నేర దర్యాప్తులో సివిల్ మరియు ట్రాఫిక్ వంటి అన్ని విభాగాలు మరియు సాంకేతిక విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా సరైన నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న వాహనాల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అటువంటి వాహన యాజమానుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తమ తమ పొలీస్ స్టేషన్లు మరియు విభాగాల్లో పని చేస్తున్న సిబ్బందిలో బాగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న వారికి రివార్డులు ఇవ్వబడతాయి అన్నారు. వారి వివరాలు పై అధికారులకు పంపిస్తూ ఉండాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో మంజూరు చేసిన నూతన పొలీస్ స్టేషన్లు త్వరలోనే ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ సత్యనారాయణ ఐపీఎస్, డీసీపీ మల్కాజ్ గిరి జానకి ఐపిఎస్, డీసీపీ యాదాద్రి రాజేష్ చంద్ర ఐపీఎస్, డీసీపీ ఎల్ బి నగర్ సాయి శ్రీ ఐపిఎస్, ఎస్ఓటి డీసీపీ గిరిధర్ ఐపిఎస్, ఎస్ఓటి డీసీపీ మురళీధర్, డీసీపీ క్రైమ్ మధుకర్ స్వామి, డీసీపీ రోడ్ సేఫ్టీ శ్రీ బాల, డీసీపీ అడ్మిన్ ఇందిర, అదనపు డీసీపీ అడ్మిన్ నర్మద, అదనపు డీసీపీ షమీర్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.





