
నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి:
రాచకొండ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ :01
భువనగిరి జోన్ అధికారులతో బుధవారం జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్లో భువనగిరి జోన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచాలని, నేర నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఐ.పి.ఎస్ ఆదేశించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి బాధలను ఓపికగా విని తగిన న్యాయం చేయాలని సూచించారు.
ప్రతి గ్రామంలో అవసరమైన మేరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు, వారి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి సత్వర న్యాయం చేకూర్చాలని సూచించారు. భూ కబ్జాదారుల పట్ల, హైవే దిగ్బంధం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించే వారి మీద పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జోన్ లోని అదికారులతో ఆయా స్టేషన్ల యొక్క పనితీరు గురించి తెలుసుకున్నారు.
యాదాద్రి భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర ఐ.పి.ఎస్, ఎస్.వెంకట్ రెడ్డి ఏసిపి భువనగిరి, కే.నర్సింహా రెడ్డి ఏ.సి.పి యాదాద్రి, సైదులు ఏ.సి.పి యాదగిరిగుట్ట, ఎన్.ఉదయ్ రెడ్డి ఏసిపి చౌటుప్పల్, భువనగిరి జోన్ సిఐ లు, ఎస్.హెచ్.ఓ లు, ఎస్ఐ లు తదితరులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల సందర్బంగా పోలీసులకు సహకరించిన భక్తులకు ధన్యవాదాలు: రాచకొండ కమిషనర్
యాదాద్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా రాచకొండ పోలిస్ కమిషనర్ డి.ఎస్. చౌహాన్ ఐ.పి.ఎస్ మంగళవారం సాయంత్రం వరకు బందోబస్తు ఏర్పాట్లను అధికారులతో పాటు సమీక్షించారు. బ్రహ్మోత్సవాల ముగింపు సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడం వల్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధారణ భక్తులకు ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలియజేశారు.





