
- మంజీరలో భక్తులపుణ్యస్నానాలు…..
- ఏడుపాయల్లో ఉప్పొంగిన భక్తిపారవశ్యం…. మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :20
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గాదేవి జాతర ఉత్సవాలలో భాగంగా మూడవరోజైన సోమవారం వేలాది మంది భక్తులు వనదుర్గ కు జేజేలు పలుకుతూ దర్శించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్,తదితర ప్రాంతాల నుండి భక్తులు వెల్లువలా వివిధ వాహనాల్లో ఏడుపాయలు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏడుపాయల ప్రాంతమంతా భక్తజనంతో నిండిపోయింది. మంజీర నదీపాయల్లో,స్నానఘట్టాలు,
షవర్ బాత్ ల వద్ద భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు .ఆలయ గర్భాలయంలో దుర్గాదేవి అమ్మవారు బంగారు హారాలతో, కోటిసూర్య ప్రభ కాంతులతో డగడగలాడుతూ, అత్యంత సుందరంగా భక్త జనావలికి దర్శనమిచ్చారు. భక్తులు భక్తిశ్రద్ధలతో దుర్గా దేవి అమ్మవారి దర్శించుకుని కుంకుమార్చన విశేష పూజలు నిర్వహించారు. అశేష జనవాహిని ,భక్తులు దుర్గా దేవి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలను, తలనీలాలను, కొబ్బరికాయలు చీరలు రవికలను సమర్పించి ఆలయంలో తోట్టేళ్లను కట్టారు. కొందరు భక్తులు మేకలు గొర్రెలు కోళ్లను బలిచ్చే మొక్కులు తీర్చుకున్నారు. మహిళా భక్తులు భారీ ఊరేగింపులతో బోనాల తో లయబద్ధంగా డప్పు చప్పుళ్ళ మధ్య నృత్యాలు చేస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అమ్మవారి ఆలయం వైపు సాగుతున్న దృశ్యాలు భక్తులను ఎంతో ఆకర్షిస్తున్నాయి.







