మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :19

ఏడుపాయల వన దుర్గాదేవి జాతర ఉత్సవాలు రెండవ రోజైన ఆదివారం నాడు శకట బ్రహ్మణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శకట భ్రమణోత్సవం ఎడ్ల బళ్ళ ఊరేగింపు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లక్షలాది భక్తులు తిలకించడం తో ఏడుపాయల ప్రాంగణమంతా భక్తజనంతో పోటెత్తారు. ఎడ్ల బండ్ల ఊరేగింపు, శివసత్తులశిగాలు, పోతరాజుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఏడుపాయలకు భారీ గా తరలివచ్చిన భక్త జనం మంజీరలో ని చెక్ డ్యాం,స్నానఘట్టాలు,శవరబాత్ ల వద్ద పుణ్య స్నానాలను భక్తులు ఆచరించి, భక్తిశ్రద్దలతో వన దుర్గాదేవిని దర్శించుకున్నారు. జాతరలో అతి ప్రధానమైన బండ్ల ఊరేగింపు రంగురంగుల చీరలు, వేప కొమ్మలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, రంగురంగుల మెరుపు కాగితాలు, దేవతామూర్తుల పటాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన గుమ్మటాల బండ్ల ఊరేగింపులో లక్షలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దుర్గాదేవి అమ్మవారికి జై జై అంటూ భక్తులు కొండలు దద్దరిల్లేలా నినదించారు. జాతర రెండవ రోజు ఇక్కడ బండ్లు తిరిగే కార్యక్రమం ప్రధాన ఆకర్షణ. బండ్ల ఊరేగింపు ముందు శివసత్తుల పూనకంతో శిగాలుగుతుండగా శకట బ్రమనోత్సవం ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం మొట్టమొదటిగా పాపన్నపేట సంస్థానాధీశుల తరఫున పాపన్నపేట సుంకరి పెద్ద కిష్టయ్య వారి బండి తిరుగగా, వెనుక వందలాది ఎడ్ల బండ్లు వాటిని అనుసరించాయి .మొదట తిరిగే పాపన్నపేట సంస్థానాధీశుల బండికి అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్,ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి, ఏడుపాయల ఆలయ పాలకమండలి ఛైర్మెన్ సాతేల్లి బాలాగౌడ్,డిఎస్పీ సైదులు,ఈఓ సార శ్రీనివాస్, తదితర అధికారులు ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు కొట్టి ఏడుపాయల్లో బండ్లు తిప్పే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బండ్ల ముందు బైండ్ల వారి డప్పు మోతలకు అనుగుణంగా యువకులు, జోగిని భక్తులు నాట్యంచేస్తూ సర్వం మరచిన యువత దుర్గా దేవిని స్తుతిస్తూ, చిందులేస్తూ ,నాట్యం ,డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను లక్షలాది మంది భక్తులు చెట్లు, కొండలు, కోనలు, భవనాలు, వాహనాలు పైకి ఎక్కి పరవశించి పోయారు. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. శివసత్తులు బండ్ల ముందు శిగాలుగుతూ నృత్యాలు చేస్తూ ,బోనాలు తీసే మహిళలు అమ్మవారికి వివిధ కళాత్మక కార్యక్రమాలు చేపట్టడం పలువురిని ఆకట్టుకున్నాయి. ఏడుపాయల భక్తులతో గుట్టలన్నీ నిండిపోయాయి .ఎటు చూసినా కిలోమీటర్ల మేర యాత్రికులు కనిపిస్తున్నారు.

ఏడుపాయల చుట్టూ రాగాల కొండ, కోనలు, చిట్టడవి, మంజీరా నది పాయలు, మంజీర సెలయేరు వన దుర్గాదేవి అమ్మవారు ఏర్పాటు చేసుకున్న ప్రకృతి రమణీయ దృశ్యాలు భక్తుల మనస్సులను దోచుకున్నాయి .అదివారం రోజు ఆలయ ప్రాంతమంతా పూర్తి జనారణ్యంగా మారిపోయింది. మిద్దెలు, మేడలు ,బంగళాలో ఉండే, పట్టణ ,గ్రామీణ ప్రాంతం వాసులకు కు మోదుగు తంగేడు వెదురు చలవ చాపలు కుటీర సౌధాలు మారాయి .ఏ చెట్టు ,గుట్ట ఏ వాహనం వంక చూసి నా చుట్టూ జన సమూహమే. ఏడుపాయల మహానగరంగా తలపించింది. బండ్ల ఊరేగింపు సమయంలో జాతర ప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనం కిటకిటలాడింది.





