
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:11
కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలి,కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరం
సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ అన్నారు. సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో మెదక్ జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని యెస్.పి గారు ప్రజలకు పలు సూచనలు చేశారు.
సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీసుల సూచనలు..
దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్ను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ప్రజలు తమ కాలనీలు, ఇళ్లు, పరిసరాలు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని.
ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.
విలువైన వస్తువులను ఇంటిలో పెట్టరాదు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు. ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.
బీరువా తాళాలను ఇంట్లో ఉంచరాదు, తమతోపాటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ ఏదైనా చైన్ వేయాలి.
టైమర్తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా ఇంటర్నెట్ అనుసంధానం ఉన్న మీ మొబైల్ నుంచే మీ ఇంటిని ఎక్కడి నుంచి అయినా లైవ్/ప్రత్యక్షంగా చూసుకునే వీలుంది. ఇంటికి సంబంధించిన నాణ్యమైన సిసిటివి లు ఆన్లైన్/ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీ సర్వెలెన్స్ కు ఇవి ఎంతో ఉపయుక్తం.
బ్యాగుల్లో బంగారు నగలు డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గరలో పెట్టుకోవాలి. బ్యాగు బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంటుంది.
సాధారణంగా సరైన భద్రతా ప్రమాణాలు పాటించని ఇండ్లు, చీకటి ప్రదేశం, పాత గ్రిల్స్, బలహీనమైన తాళాలు ఉన్న ఇండ్లలో దొంగలు పడే అవకశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, కొత్త వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
దగ్గరలోని పోలీసు స్టేషన్ నెంబర్ అందుబాటులో ఉంచుకోవాలి. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా మెదక్ జిల్లా పోలీసు వాట్సాప్ నెంబర్ 7330671900 కు సమాచారం ఇవ్వాలి.





