
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి :6
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. తన ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తూ వారికి పెన్ డ్రైవ్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నవంబర్ 9 న ఓటర్ల ముసాయిదా ప్రకటించే నాటికి జిల్లాలో 4,06,629 మంది ఓటర్లు ఉండగా నేడు తుది జాబితా ప్రకటించే నాటికి 4,09,473 మంది ఓటర్లుగా ఉన్నారని అన్నారు. ప్రత్యేక డ్రైవ్ చేపట్టడంతో, పాఠశాల, కళాశాలలో క్యాంపస్ అంబాసిడర్ల ద్వారా, లిటరసీ క్లబ్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు బ్లాక్ స్థాయిలో ఇంటింటికి తిరిగి 18 ఏళ్ళు నిండిన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయడం, స్వీప్ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడం వంటి కారణాల వల్ల కొత్తగా 9,860 ఓటరులుగా నమోదయ్యారని అన్నారు. మెదక్ నియోజక వర్గంలో 2,02,636 మంది ఓటరు ఉండగా ఇందులో 1,05,077 మంది మహిళా ఓటర్లు, 97,556 మంది పురుష ఓటర్లు, ఇతరులు ముగ్గురు ఉన్నారని రమేష్ తెలిపారు. అదేవిధంగా నరసాపూర్ నియోజక వర్గంలో 2,06,837 మంది ఓటర్లు ఉండగా అందులో 1,04,710 మంది మహిళా ఓటర్లు, 1,02,120 మంది పురుష ఓటరులు, 7 మంది ఇతరులు ఉన్నారని అన్నారు. జనాభా లెక్కల ప్రకారం రెండు నియోజక వర్గాలలో పురుషులకన్నా మహిళా ఓటర్లే అధికారంగా ఉన్నారని ఆయన చెప్పారు. ఇట్టి ఓటర్ల తుది జాబితాను జిల్లాలోని 576 పోలింగ్ బూతులతో ప్రదర్శిస్తున్నామని అన్నారు.

ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని, భారత ఎన్నికల కమీషన్ 18 ఏళ్ళు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదుకు ఏడాదిలో నాలుగు పర్యాయాలు నమోదు చేసుకోవడానికి అవకాశాలు కల్పించిందని క్షేత్ర స్థాయిలో కార్యకర్తల ద్వారా విస్తృత అవగాహన కలిగించి అర్హులైన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఓటరు నమోదు, నిర్వహణలో ప్రజాప్రతినిధుల సహకారం మరువలేనిదని ఇదే స్ఫూర్తి కొనసాగాలని అన్నారు. ఎటువంటి తప్పులు లేకుండా తుది జాబితా జాగ్రత్తగా రూపొందించామని, ఇందులో సాంకేతిక తప్పిదాలు, చిన్న పొరపాట్లున్నా ఏమైనా అభ్యంతరాలు ఉంటె పక్కాగా తెలిపితే సరిచేస్తామని అన్నారు. ఇది ఎన్నికల సంవత్సరమని, ఈ జాబితానే అన్నింటికీ ప్రామాణికమని అన్నారు. తిరిగి ఓటరు నమోదుకు పోర్టల్ ప్రారంభమవుతుందని, ఫారం-6,7,8 అందుబాటులో ఉంటాయియని, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోను వారి జాబితాను తుది జాబితాకు అనుబంధంగా చేరుస్తామని అన్నారు.
రెండు ప్రాంతాలలో ఓటరుగా నమోదయిన వారు కొందరున్నారని ప్రజాప్రతినిధులు తెలుపగా , సరైన వివరాలు అందిస్తే సంబంధితులకు నోటీసు ఇచ్చి ఒక ప్రాంతంలో తొలగిస్తామని రమేష్ తెలిపారు. అలాగే చనిపోయిన , ఇతర ప్రాంతాలకు వెళ్లిన వివరాలు కూడా అందిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సమావేశంలో ప్రజాప్రథినిధులు కాంగ్రెస్ నుండి గూడెం ఆంజనేయులు, బి.జె.పి నుండి శివ, టి.డి.పి నుండి మహమ్మద్ ఆఫ్జాల్, బి.ఎస్.పి నుండి అప్పాజిపల్లి సురేష్, ఆర్.డి.ఓ. సాయి రామ్, స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి, ఎలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, నరేష్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.





