కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి
మహాసభలలో దేశ రాజకీయ పరిస్థితులను చర్చిస్తాం : సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు
జనసముద్రంన్యూస్, జూన్ 8 నరసరావుపేట ;
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్ళు పూర్తి చేసుకున్న సంవత్సరంలో పార్టీ మహాసభలు జరుపుకోబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. నరసరావుపేట సిపిఐ కార్యాలయంలో శనివారం నాడు ఉదయం 10 గంటలకు సిపిఐ పట్టణ, నియోజకవర్గ మహాసభలలో పాల్గొని ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి కమ్యూనిస్టు పార్టీ మహాసభలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనిలో భాగంగా శాఖ, మండల, జిల్లా మహాసభలు జరుపుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాఖలు మండల పట్టణ నియోజక వర్గ జిల్లాల మహాసభలు కొన్ని పూర్తి అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలోని 26 జిల్లాల మహాసభలు పూర్తి అయిన తరువాత ఆగస్టు 23, 24, 25 తేదీలలో ఒంగోలు నగరంలో రాష్ట్ర మహాసభలు జరుపుకోబోతున్నామని, దేశంలోని అన్ని రాష్ట్రాల మహాసభలు పూర్తి అయిన తరువాత సెప్టెంబర్ నెలలో చంఢీఘర్ నగరంలో జాతీయ మహాసభలు జరుగబోతున్నాయని తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జాతీయ, రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా చర్చించబోతున్నామన్నారు.
డిసెంబర్ 26వ తేది నాటికి భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఖమ్మం నగరంలో లక్షలాది మందితో ర్యాలీ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గత 12 ఏళ్లుగా దేశాన్ని పరిపాలిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదని, ఒక్క సమస్యకు కూడా పరిష్కారం చూపలేదని విమర్శించారు. రైతులపై నల్ల చట్టాలు నిరుద్యోగం, పేదరికం సమస్యలపై కనీసం మాట్లాడిన పాపాన పోలేదని అన్నారు. నల్లధనాన్ని కట్టడి చేస్తామని, విదేశాలలో ఉన్న రూ.70 లక్షల కోట్ల నల్లధనాన్ని వెనక్కి తెస్తామని ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. బ్యాంకులకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిన వారికి వత్తాసు పలుకుతున్నారే తప్పా వారిని వెనక్కు తీసుకురాలేకపోయారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ప్రాతిపదికన విభజన చేసి తద్వారా మెజారిటీ మతస్తులను సంతృప్తిపరచి తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుందని మండిపడ్డా అమెరికా అధ్యక్షుడు ట్రంపు యుద్ధం విరమించండి అని భారత్ పాక్ దేశాల ను ఆదేశిస్తే రెండు తోకముడిచాయని చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధాని మోదీపై ఉందన్నారు. వ్యాపార లావాదేవీలు బంద్ చేస్తామని చెబితే భయపడి ఇరుదేశాలు యుద్ధాన్ని మానుకున్నాయని ట్రంప్ బాహాటంగా చెబుతున్నప్పటికీ మోదీ ఖండించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం దేశాన్ని ట్రంప్ అవమానిస్తే దానికి జవాబు చెప్పలేని పరిస్థితిలో మోదీ ఉన్నాడని విమర్శించారు. ఇండియా కూటమి పక్షాలు దీనిపై పార్లమెంట్ సమావేశాలు జరిపి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా యన్నారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అయిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని పట్టణాలలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు వృద్ధాప్య వితంతు వికలాంగుల ఒంటరి మహిళ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు షేక్ హుస్సేన్, కాసా రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఉలవలపూడి రాము, నియోజకవర్గ కార్యదర్శి చక్రవరం సత్యనారాయణ రాజు, పట్టణ కార్యదర్శి వైదన వెంకట్, ఏఐటియుసి నాయకులు ఉప్పలపాటి రంగయ్య, షేక్ జాన్ చిన సైదా, మహిళా నాయకురాలు దేవి, కోయ శీను, హర్ష,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మహాసభ ఏరియా పట్టణ నూతన కమిటీలను ఎన్నుకున్నారు. మహాసభకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఉత్సాహంగా విప్లవ గీతాలు పాడి వినిపించారు.





