— వర్ష సూచనల తో ఆందోళనలో రైతులు
జనసముద్రం న్యూస్, కోహెడ, ఏప్రిల్ 30: (కోహెడ ప్రసాదరావు)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో నత్తనడకన కొనసాగుతుండడంతో రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 12న మండలంలోని 15 గ్రామాల్లో ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలును అధికారులు ప్రారంభించారు. మండలంలోని కోహెడ తంగళ్ళపల్లి శనిగరం కాచాపూర్ తీగలకుంటపల్లి వింజపల్లి పోరెడ్డిపల్లి బస్వాపూర్ సముద్రాల శ్రీరాములపల్లి పరివేద కూరెళ్ళ గుండారెడ్డిపల్లి వరి కోలు రామచంద్రాపూర్ తదితర గ్రామాల్లో ఐకెపి సెంటర్ల ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేపట్టారు. రైతులు ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల వద్ద ఉంచి తూకం కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపు వర్ష సూచనలతో వాతావరణ సాయంత్రం కల్లా మారుతుండడంతో రైతులు భయంతో కల్లాల వద్దే ఉండాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని సెంటర్లలో కొనుగోలు వేగవంతంగా ఉన్న చాలా కేంద్రాల్లో తూర్పార పట్టే యంత్రాలు అందుబాటులో లేక కొనుగోలులో ఆలస్యం జరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందతన్నారు. మరోవైపు పలువురు రైతులు ఐకెపి సెంటర్ల ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని వర్షం వల్ల తమ ధాన్యం ఎక్కడ దెబ్బతింటొందనని భయంతో ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించి ఆడ్తిదారులు రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు మండల వ్యాప్తంగా 54 వేల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కనుగోలు చేశామని ఐకెపి ఏపీఎం తిరుపతి వెల్లడించారు. మరో లక్ష క్వింటాళ్ల కొనుగోలు జరుగుతోందని భావిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు కేంద్రాలు పనిచేస్తాయని అన్నారు. కొనుగోలులో జాప్యం జరుగుతున్న కేంద్రాలపై దృష్టి పెట్టి త్వరితగతన కొనుగోలు జరిగేలా చూస్తామని అన్నారు. వర్ష సూచనల దృష్ట్యా ధాన్యం కొనుగోలులో వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.





