
- పెండింగ్లో ఉన్న 359 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించాలి….
- మెదక్ కలెక్టర్ రాజర్షి షా…
మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 6
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి ప్రజావాణి పోర్టల్ లో అప్ డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదిదారుల నుండి అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్ లతో కలిసి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిర్ణయాధికారాలు తీసుకునే జిల్లా అధికారులే తప్పని సరిగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని, అత్యవసరమైతే ముందస్తుగా అనుమతి పొంది తరువాత స్థాయి (నెక్స్ట్ లెవెల్ ) అధికారిని పంపాలని సూచించారు. ఇప్పటి వరకు వివిధ శాఖలలో పెండింగులో ఉన్న 359 దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిపెట్టి వచ్చే ప్రజావాణి కార్యక్రమం నాటికి పరిష్కరించాలని ఆదేశించారు.

ఫిర్యాదీదారులతో క్రిక్కిరిసిన ప్రజావాణిలో కలెక్టర్ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతూ ఫిర్యాదీదారుల సమస్యలు సావధానంగా ఆలకించి, ఆప్యాయంగా పలుకరిస్తూ తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ధీమా కల్పించారు. ప్రతి ఫిర్యాదీదారుడు ముందుగా కంప్యూటర్ లో నెంబర్ జెనరేట్ చేసుకున్న తరువాతే ఫిర్యాదులు పరిశీలించారు. 60 దరఖాస్తులు రాగా అందులో ప్రధానంగా భూ సమస్యలు, ధరణి, రెండు పడకల ఇళ్ళు , ఆసరా పింఛన్లు, ఆర్థిక సహాయం, మూడు చక్రాల సైకిళ్ళు, తదితర వాటికి సంబంధినవి ఉన్నాయి. అలాగే అర్హులైన మైనారిటీలకు ఋణం మంజూరు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని, దేవాలయానికి ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని విజ్ఞప్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదీదారుల సమస్యలను పరిశీలించి పరిష్కారమయ్యే వాటిని వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించే వాటికి కారణాలు తెలపాలని, పరిష్కార మార్గాలు చూపాలన్నారు. సదరం క్యాంపులో 40 శాతం పైగా వికలాంగత్వం ఉన్నట్లు ధ్రువపత్రం ఇస్తేనే వికలాంగుల పింఛనుకు అర్హులని, తిరస్కరణకు గురైన పింఛను మంజూరు దరఖాస్తును తిరిగి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనుటకు పాత ఐ.డి. ని రద్దు చేస్తూ కొత్త ఐ.డి. కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించవలసినదిగా డిఆర్ డిఓ కు సూచించారు. రేపటి నుండి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దరఖాస్తులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయవలసినదిగా ఏ.ఓ.యూనుస్ కు సూచించారు.
ఆస్తి తగాదాలకు సంబంధించి భూ సమస్యల పరిష్కారానికి కోర్టును ఆశ్రయించవలసినదిగా ఫిర్యాదీదారులకు సూచించారు. తమ సమస్యలతో పాటు నలుగురికి ఉపయోగపడే సామాజిక సమస్యలు ప్రజావాణి దృష్టికి తేవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు శైలేష్, జయరాజ్, కమలాకర్, శ్రీనివాస్ రావు, శ్రీనివాస్, కేశూరం, ఆశా కుమారి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.





