
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్ ,పినపాక, జనవరి 28.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు మిషిన్ శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే సీఎం కేసీఆర్ ధ్యేయమని దేశంలోనే తెలంగాణ మహిళలు ఆదర్శంగా నిలవాలని అన్నారు.మహిళలు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సీఎం కేసీఆర్ సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారని, ఆర్థికంగా ఎదిగేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కృషితో నియోజకవర్గంలో మహిళలు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలోనూ ఒక విజన్ తో ముందుకు సాగుతున్నామన్నారు.ఈ ప్రాంతంలోని మహిళలు స్వయం శక్తితో ఎదగాలని కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండలం బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.





