జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 28.

*కాంట్రాక్టర్ల కక్కుర్తి,అధికారుల అవినీతికి చిహ్నంగా మారిన వైనం.
- లక్షల రూపాయలతో జరిగే పనులపై అధికారుల నిర్లక్ష్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట పంచాయతీ పరిధిలోని అమరారం గ్రామం వరకు నిర్మించే రహదారి పనులు కాంట్రాక్టర్లకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయని జరిగే పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైందని తద్వారా పనుల్లో నాణ్యత లోపించి అతికొద్ది కాలంలోనే మరమ్మతులకు గురయ్యే అవకాశం ఉందని పరిసర గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు . ఈ చర్చలకు బలాన్ని చేకూరుస్తూ ఆర్అండ్బీ అధికారుల పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ శాఖ తనిఖీలు లేకపోవటం,పనులు జరిగే సమయంలో ఆర్అండ్బీ అధికారులు కనిపించకపోవడం, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పినపాక మండలం జానంపేట నుంచి అమరారం 3 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు జరుగుతున్నాయి.దీనికి అయ్యే ఖర్చు సుమారు కోటి డెబ్భై లక్షల రూపాయలు వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి.ఈ రోడ్డు పనుల్లో వాడే కంకరలో నాణ్యత లేకపోవడంతో పిండిగా ఉండే కంకర వాడుతున్నట్లు తెలస్తోంది. రోడ్డు కంకర వేసి రోలింగ్ చేసే క్రమంలో వాటర్ క్యూరింగ్ సక్రమంగా చేయడం లేదు.దానితో దుమ్ము బాగా లేస్తున్నందున ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోడ్డు పనుల్లో అడుగడుగునా లోపాలు.కొన్ని చోట్ల బాగున్న తారు రోడ్లను పెకళించి దాన్నే రోలింగ్ చేసి, ఆపైన తారు రోడ్డు వేస్తున్నారు.ఇప్పటి వరకు చేపట్టిన పనుల్లో ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించిన దాఖలాలు లేవు.
కనిపించని ప్రమాదాల హెచ్చరిక బోర్డులు:
ఈ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహన దారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది.రాత్రి సమయాలలో కొత్తగా వెళ్ళేవారికి తెలియక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది.అంతేగాక రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదారులు రోడ్డుకు ఇరువైపులా తీసిన గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడే అవకాశం లేకపోలేదు.వెంటనే ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకముందే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే గ్రామస్తులకు ,వాహనదారులకు ఉపయోగంగా ఉంటుందని ఇకనైనా అధికారులు మేల్కొని రహదారి నిర్మాణ పనుల్లో జరిగే ఆరోపణలపై తగు చర్యలు తీసుకొని ,నాణ్యతతో కూడిన పనులను జరిపించే విధంగా చూడాలని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.





