
జనసముద్రం న్యూస్,జనవరి 7:

మెగా బ్రదర్ జనసేన పార్టీ ముఖ్య నేత నాగబాబు మరోసారి నిప్పులు చెరిగారు. సాధారణంగా విమర్శలను పట్టించుకోరు.. నాగబాబు. అయితే తన అన్న చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే మాత్రం నాగబాబు వారిపైన తీవ్ర విమర్శలతో విరుచుకుపడతారు. తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాపై నాగబాబు మండిపడ్డారు.
తాజాగా ఆర్కే రోజా.. చిరంజీవి కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి కుటుంబంలో ఎవరూ ప్రజలకు సహాయం చేసేవారు ఎవరూ లేరని విమర్శించారు. అందుకే ముగ్గురిని వారి సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీలోనే కలకలం సృష్టించాయి. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. పైగా ఆయనెక్కడా వైఎస్ జగన్ ను విమర్శించింది లేదు. వైసీపీని కూడా ఏ విషయంలోనూ తప్పుపట్టలేదు. అందులోనూ చిరంజీవిని జగన్ సోదరుడిగా గౌరవిస్తున్నారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అలాంటి రోజా.. చిరంజీవిపై విమర్శలు చేయడం వైసీపీ శ్రేణులకు సైతం నచ్చలేదు.ఈ నేపథ్యంలో రోజా వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు నిప్పులు చెరిగారు. రోజా గతంలో కూడా ఇలాగే పలుమార్లు తమపై విమర్శలు చేసినా స్పందించకపోవడానికి కారణం.. ఆమె నోటికి మున్సిపాలిటీ చెత్త కుప్పకు పెద్ద తేడా లేదని.. అందుకే తాను స్పందించలేదన్నారు. చూస్తూ చూస్తూ ఎవరూ కుప్పతొట్టిని కెలకరని నాగబాబు అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో తాను మాట్లాడిన ఒక వీడియోను షేర్ చేశారు.
పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా అనవసర విమర్శలు మానుకుని ఆ శాఖ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. పర్యాటక శాఖ అంటే రోజా పర్యటనలు చేయడం కాదని నాగబాబు ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంలో దేశంలో కేరళ అసోం గుజరాత్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని ఏపీ 18వ స్థానానికి పడిపోయిందన్నారు. వైసీపీ పాలన ముగిసేలోపు 20వ స్థానానికి దిగజారినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు.ఏపీలో పర్యాటక శాఖపై ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది ఉపాధి పొందుతున్నారని.. దాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టాలని రోజాకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పర్యాటక రంగంపై ఉపాధి పొందుతున్నవారు దెబ్బతిన్నారని నాగబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా రోజా పర్యాటక రంగ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు.