జనసముద్రం న్యూస్, మే 24

కిడ్నీ అమ్ముకుంటే ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయని ఆశ పెట్టారు, నాకు భయమేసింది. ఆ తర్వాత నేను ఏడాది పాటు వేరే రాష్ట్రానికి పనికి వెళ్లిపోయాను. ఏడాది తర్వాత తిరిగి వచ్చిన నాకు ఎక్కువ డబ్బులు ఆశ చూపి కిడ్నీ ఇచ్చేటట్లు చేశారు” అని విశాఖపట్నానికి చెందిన శ్రీనివాస్ చెప్పారు.
ఇలాగే విశాఖకు చెందిన వినయ్ కుమార్ కూడా ఆర్థిక ఇబ్బందులతో దళారుల మాటలు నమ్మి మూత్రపిండం అమ్ముకున్నారు. ఇస్తానన్న డబ్బులు ఇవ్వకుండా దళారులు మోసం చేశారంటూ ఆయన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వినయ్తో మాట్లాడేందుకు ఆయనుండే మధురవాడ వాంబే కాలనీకి వెళ్లిన బృందానికి ఆటోడ్రైవర్లు, దినసరి కూలీలుగా పని చేసుకునే మరో ముగ్గురు తారసపడ్డారు. వీరు కూడా తమ కిడ్నీలను అమ్ముకున్నారు.
విశాఖపట్నంలో చట్టవిరుద్ధంగా 10 శాతం మేర కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని నగర పోలీసు కమిషనర్ కూడా ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు.
ఇక్కడ కిడ్నీల వ్యాపారం ఎలా జరుగుతోంది? వాటిని ‘కొనేందుకు’ దళారులు ఎలా వల వేస్తున్నారు?
అవసరంలో ఉన్నవారికి ఆశ చూపుతారు
అద్దె ఆటో మానేసి సొంత ఆటో ఉంటే బాగుణ్ణు అని వినయ్ కుమార్ ఆలోచించారు. కిడ్నీ అమ్ముకుంటే కొత్త ఆటో కొనుక్కోవచ్చని తనకు దళారులు కామరాజు, ఇలియానా ఆశ పెట్టారని ఆయన చెప్పారు.
మరి కొందరిని కూడా ఆర్థిక అవసరాలు తీరాలంటే కిడ్నీ అమ్ముకుంటే సరిపోతుందని ప్రలోభపెట్టారు. అలా చేసేందుకు భయపడిన వారిని నిరంతరం ట్రాక్ చేస్తూ, వారిని ఎలాగోలా ఒప్పించేవారు. మధురవాడ వాంబే కాలనీలో బీబీసీతో మాట్లాడిన కొందరు ఈ విషయం చెప్పారు.
ఇలానే కిడ్నీ ఇచ్చిన శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘డబ్బుల విషయంలో మా ఇంట్లో చిన్న గొడవ జరిగింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. ఆ సమయంలో నా వద్దకు వచ్చి డబ్బులిచ్చి, మందు పట్టించారు. కిడ్నీ అమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయన్నారు. భయంతో వాళ్లతో మాట్లాడటం మానేశాను’’ అని చెప్పారు.

“కానీ, కొన్ని రోజుల తర్వాత మళ్లీ కిడ్నీ ఇచ్చేలా నన్ను వారు ఒప్పించారు. పెందుర్తిలోని తిరుమల ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేశారు. అప్పుడు నాతో పాటు మరో నలుగురు పేషెంట్లు అక్కడ ఉన్నారు. నాకు రూ. 15 లక్షలు ఇస్తామని చెప్పి, ఒక లక్ష రూపాయలు, ఒక ద్విచక్ర వాహనం ఇచ్చారు. మిగతా డబ్బులు అడిగితే, ఎక్కువ మాట్లాడితే ఇచ్చినవి కూడా లాక్కుంటామని బెదిరించారు” అని శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.
అలాగే రూ. 8.5 లక్షలు ఇస్తామని చెప్పి, రూ. 2.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగతా డబ్బులడిగితే అమ్మనాన్నలను ఏదైనా చేస్తామని బెదిరించారని వినయ్ కుమార్ చెప్పారు.
“డబ్బులు అవసరం ఉంది, మా అవయవాలు అమ్మి పెట్టండి, మేడం” అంటూ తనకు రోజూ ఫోన్ కాల్స్ వస్తుంటాయని గూడూరు సీతామహాలక్ష్మి చెప్పారు.
ఆమె అఖిల భారత శరీర అవయవదాతల సంఘం స్థాపించి, అవయవదానంపై 17 ఏళ్లుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
“పేదవాళ్లు నేడు మొబైల్ ఆర్గాన్ బ్యాంక్స్ అయిపోయారు. వారి ఆర్థిక అవసరాలు వారిని అవయవాలు అమ్ముకునేలా చేస్తున్నాయి. అవయవాల కోసం ఎదురు చూస్తున్న కొందరు సంపన్నుల కోసం దళారులు రంగంలోకి దిగుతున్నారు. అవయవాలు అమ్ముతామని నాకు నెలకు 30, 40 ఫోన్ కాల్స్ వస్తాయి. నేను వాళ్లకు డబ్బులకి అవయవాలు అమ్ముకోవడం తప్పు అని చెప్తుంటాను. నా వల్ల పని జరగలేదు కాబట్టి, నాకు ఫోన్ చేసిన వారే ఇతర మార్గాలలో దళారులను, ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు’’ అని ఆమె బీబీసీతో చెప్పారు.
‘‘నాకు తెలిసి విశాఖ జిల్లాలో అనధికారికంగా ఏడాదికి వందైనా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయి. బాధితులుగా మారిన తర్వాత మళ్లీ మమ్మల్ని సంప్రదిస్తారు. కానీ అప్పటీకే చేయిదాటిపోతుంది” అన్నారు.
‘‘అక్రమ అవయవాల మార్పిడి కోసం గ్రహీతకు, దాతకు మధ్య తప్పుడు ఆధార్ కార్డులతో బంధుత్వాలని సృష్టిస్తున్నారు. వీరికి అధికారుల అండదండలు కూడా ఉంటున్నాయి’’ అని సీతామహాలక్ష్మి అన్నారు.
పేదల ఆర్థిక అవసరమే అవయవాల అక్రమ వ్యాపారానికి పెట్టుబడిగా మారిందని, విశాఖలో పేదల కాలనీలు, మురికివాడలపై దళారులు దృష్టి పెట్టారని ఆమె తెలిపారు.





