జనసముద్రం న్యూస్,జనవరి 03:

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము కింద దొంగ నోట్లు అంటగట్టిన వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనవరి 1న కొత్త సంవత్సరం నాడు పింఛన్ల పంపిణీలో దొంగనోట్లు రావడంతో ఓ వలంటీరును పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. ఆ వలంటీర్ ఇచ్చిన సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లె లోయపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి బాధితులు పోలీసుల కథనం ప్రకారం.. నరసాయిపాలెం ఎస్సి కాలనీ గ్రామ వలంటీరుగా ముటుకూరి ఆమోష్ పని చేస్తున్నాడు. ఒకటో తేదీ కావడంతో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. ఈ డబ్బులలో రూ.19500 పక్కకు తీసి తన దగ్గర ఉన్న రూ.19.500 దొంగ నోట్లను (రూ.500 నోట్లను) అందులో కలిపాడు. 24 మంది లబ్ధిదారులకు రూ.2750 చొప్పున పింఛను పంపిణీ చేశాడు. ఇందులో కొంతమందికి నకిలీ నోట్లు వెయ్యి రూపాయల చొప్పున కలిపి ఇచ్చాడు.ఈ క్రమంలో పింఛను డబ్బులు తీసుకున్న బంగారమ్మ అనే మహిళ తన బంధువులకు ఫోన్ పే చేయించేందుకు వెళ్లింది. ఇందుకోసం దుకాణదారునికి డబ్బులు ఇచ్చింది. ఇందులో దొంగ నోట్లు ఉన్నట్లు ఆయన గుర్తించి ఆమెకు తెలియజేశాడు.
ఈ విషయం తెలుసుకున్న మిగతా లబ్ధిదారులు కూడా తాము తీసుకున్న పింఛను డబ్బులను దుకాణదారు దగ్గరకు తీసుకెళ్లి చూపించగా వాటిలోనూ దొంగ నోట్లు బయటపడ్డాయి. ఈ విషయాన్ని నరసాయిపాలెం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పేరయ్య ఎంపీడీవో ఎం.రంగసుబ్బరాయుడు దృష్టికి లబ్ధిదారులు తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో పోలీసులతో కలిసి నరసాయిపాలేనికి ఎంపీడీవో వచ్చి నిలదీయడంతో తానే దొంగనోట్లను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వలంటీర్ ఒప్పుకున్నాడు. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు వలంటీరును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దొంగనోట్లు వలంటీర్కు ఎలా వచ్చాయి? ఇటువంటి చర్యకు పాల్పడడం ఇదే తొలిసారా? ఇందుకు ముందుకూడా ఇలా చేశాడా? ఈ దొంగనోట్ల వెనుక ఎవరు ఉన్నారు? తదితర విషయాలపై విచారణ చేశారు.
ఇప్పుడు అతడు ఇచ్చిన సమాచారం మేరకే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని మిట్టమీదపల్లె లోయపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.





